Kiwis: కివీస్.. మళ్లీ అదే తీరు.. జోరు పెంచిన భారత బౌలర్లు.. మూడు వికెట్లు డౌన్

  • తడబడుతున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్
  • కట్టడి చేస్తున్న భారత బౌలర్లు
  • 25 ఓవర్లకి 95 పరుగులు 

కివీస్ బ్యాటింగు తీరు ఏమాత్రం మారలేదు. మౌంట్ మాంగనూయ్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో విలియమ్సన్ సేన మరోమారు ఆపసోపాలు పడుతోంది. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు కివీస్ బ్యాట్స్‌మెన్ అష్టకష్టాలు పడుతున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. షమీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ కోలిన్ మన్రో (7) రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (13) భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్‌తో కలిసి కెప్టెన్ విలియమ్సన్ (28) జాగ్రత్తగా ఆడాడు. ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి చాహల్ దెబ్బకొట్టాడు. అద్భుతమైన బంతితో కివీస్ కెప్టెన్‌ను వెనక్కి పంపాడు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసే సరికి కివీస్ మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. రాస్ టేలర్, టామ్ లాథమ్ క్రీజులో ఉన్నారు.

More Telugu News