USA: అమెరికాలో మరో మారు గర్జించిన గన్: తల్లిదండ్రులు సహా ఐదుగురిని కాల్చిచంపిన యువకుడు!

  • అమెరికాలోని లూసియానాలో ఘటన
  • తల్లిదండ్రులతో పాటు మరో ముగ్గురి కాల్చివేత
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

ఇంట్లో అడుగుపెట్టవద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు ఓ కుమారుడు రెచ్చిపోయాడు. కన్న తల్లిదండ్రులు అన్న కనికరం లేకుండా వారిద్దరిని తుపాకీతో కాల్చిచంపాడు. ఈ కుటుంబానికి పరిచయం ఉన్న మరో ముగ్గురిని కూడా దారుణంగా హతమార్చాడు. చివరికి వారి ట్రక్కును తీసుకుని ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. అమెరికాలోని లూసియానాలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

లూసియానా రాష్ట్రంలోని అసెంప్షన్ ప్రాంతానికి చెందిన డకోటా థెరియోట్(21) జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనీ, ఇకపై తిరిగిరావొద్దని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీంతో విచక్షణ కోల్పోయిన థిరియోట్ ఎలాగోలా ఓ తుపాకీని సంపాదించాడు. అనంతరం లివింగ్ స్టన్ ప్రాంతంలో ఉంటున్న బిల్లీ ఎర్నెస్ట్(43), సమ్మర్ ఎర్నెస్ట్ (20), టన్నర్ ఎర్నెస్ట్(17)ను కాల్చిచంపాడు. వీరంతా నిందితుడి కుటుంబానికి పరిచయస్తులేనని అధికారులు తెలిపారు.

ముగ్గురిని హతమార్చిన అనంతరం వారి ట్రక్కును తీసుకుని ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు కీత్(51), ఎలిజబెత్ లను వెంటపడి మరీ తుపాకీతో కాల్చాడు. అనంతరం ట్రక్కులో ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. థెరియోట్ కాల్పుల్లో తల్లిదండ్రులు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నామని పేర్కొన్నారు.

More Telugu News