Haryana: ఆస్తి అంతా ప్రియురాలికి ఇచ్చేస్తాడని.. కాంట్రాక్టు హంతకులతో భర్తను హత్య చేయించిన భార్య!

  • హరియాణాలోని గురుగ్రామ్ లో ఘటన
  • రూ.16 లక్షలు సుపారీ ఇచ్చేందుకు అంగీకారం
  • నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

అనుమానం పెనుభూతంగా మారి ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన భార్య ఆస్తి మొత్తాన్ని ఆమె పేరునే రాసేస్తాడని భయపడింది. ఇది జరగకుండా ఉండాలంటే భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఏకంగా ఓ ముఠాకు సుపారీ ఇచ్చింది. చివరికి ఈ కేసును విచారించిన పోలీసులు సదరు భార్యను కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది.

గురుగ్రామ్ కు చెందిన జోగీందర్ స్వీటీ అనే మహిళను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లియినప్పటి నుంచి తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని స్వీటీ అనుమానించేది. సంపాదన మొత్తాన్ని ఆమెకే తగలేస్తున్నాడని విమర్శించేది. ఈ క్రమంలో ఆస్తి మొత్తాన్ని సదరు మహిళకే ఇచ్చేస్తాడని భయపడ్డ ఆమె కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ.16 లక్షలకు సుపారీ ఇచ్చింది. ఇందులో రూ.2.5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చింది. దీంతో ఆ దుండగులు జోగీందర్ ను ఈ నెల 17న దారుణంగా హత్యచేసి గోనెసంచిలో కుక్కి పడేశారు.

జోగీందర్ కనిపించకపోవడంతో ఆయన సోదరుడు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో బజ్‌గేరా ప్రాంతంలో ఓ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చనిపోయిందని జోగీందరే అని అతని కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఈ నేపథ్యంలో తన అన్న చావుకు వదిన స్వీటీనే కారణమని మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో తానే ఈ హత్య చేయించానని స్వీటీ అంగీకరించింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు స్వీటీని కటకటాల వెనక్కు నెట్టారు. పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News