Telangana: వివాహితపై కన్నేసి వేధించిన యువకుడు.. వెంటపడి రాళ్లతో కొట్టిచంపిన భర్త!

  • తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఘటన
  • మహిళను వేధిస్తున్న డిగ్రీ విద్యార్థి
  • పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు

వివాహితపై కన్నేసిన ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలని వేధించసాగాడు. ఇది గమనించిన ఆమె భర్త, మిగతా కుటుంబ సభ్యులు హెచ్చరించినా సదరు యువకుడి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. చివరికి విసిగిపోయిన బాధితురాలి భర్త సదరు యువకుడిని కిరాతకంగా హత్యచేశాడు. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రమణతండాకు చెందిన హరీశ్(19) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను అదే తండాకు చెందిన సునీతను గతకొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయంలో సునీత భర్త చంటితో హరీశ్ కుటుంబ సభ్యులకు గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి.

ఈ నేపథ్యంలో నిన్న పొలంలోకి సునీత వెళ్లగా, ఆమె వెనకాలే హరీశ్ వచ్చాడు. ఇది చూసిన భర్త చంటి కోపం పట్టలేకపోయాడు. హరీశ్ పై రాళ్లతో దాడిచేస్తూ తరుమాడు. చివరికి హరీశ్ ఆ రాళ్ల దెబ్బలతో పరిగెత్తలేక పడిపోవడంతో ఓ బండరాయితో తలపై మోది హత్య చేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News