Maharashtra: ఐదేళ్ల బాలుడిని నోటకరిచి ఎత్తుకు వెళ్లిన పులి.. ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారి!

  • మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో ఘటన
  • చిక్‌గావ్‌ గ్రామంలోకి ప్రవేశించిన పులి
  • గ్రామస్థులు వెంబడించడంతో ఊరిబయట మృతదేహాన్ని వదిలి పరారు

రాత్రిపూట ఇంట్లో నిద్రపోతున్న ఐదేళ్ల బాలుడిని పులి ఎత్తుకు వెళ్లింది. పులినోట కరవడంతో చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా బ్రహ్మపురం తాలూకా చిక్‌గావ్‌ (డోర్లీ) గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోకి ప్రవేశించిన పులి ఐదేళ్ల సురేంద్ర అలియాస్‌ పింటూ డోరేను నోటితో పట్టుకుంది.

దీంతో బాలుడు గట్టిగా ఏడవడంతో మేలుకున్న గ్రామస్థులు ప్రమాదాన్ని గుర్తించి కర్రలతో పులివెంట పడ్డారు. దీంతో భయపడిన పులి బాలుడిని ఊరి చివర మురుగు కాలువ కోసం తీసిన గుంతలో పడేసి వెళ్లిపోయింది. గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. దీంతో పులి బెడద వదిలించే వరకు తాము అక్కడి నుంచి కదిలేది లేదని గ్రామస్థులు భీష్మించుకుని కూర్చోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

More Telugu News