Telugudesam MPs: అచ్చం అలాగే...కరుణానిధి వేషంతో ఆకట్టుకున్న ఎంపీ శివప్రసాద్‌

  • పార్లమెంటు ఆవరణలో ప్రత్యేక ఆకర్షణ
  • కేంద్రం తీరుపై నిరసనలో భాగంగా వేషధారణ
  • మోదీ వద్ద సత్యం, ధర్మం లేవని విమర్శ

నిరసన అంటే ప్రత్యేక వేషధారణతో సిద్ధమయ్యే చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ శుక్రవారం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి వేషధారణతో ఆకట్టుకున్నారు. అచ్చం ఆయనలాగే వేషధారణతో చక్రాల కుర్చీలో ఆకట్టుకున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కేంద్రం కక్ష సాధిస్తున్న తీరును నిరసిస్తూ మూడు రోజు నుంచి పార్లమెంటు ఎదుట తెలుగుదేశం ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  గురువారం గారడీ చేసే వ్యక్తి వేషధారణతో ఆకట్టుకున్న శివప్రసాద్‌ నేడు కరుణానిధి వేషంతో ఆకర్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ వద్ద ధర్మం, సత్యం లేవని విమర్శించారు. దేవుని సాక్షిగా ఇచ్చిన హామీలు కూడా తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. ఏపీ ముఖ్యమంత్రి స్నేహ హస్తం అందిస్తే నాలుగేళ్లపాటు రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. నాయకుడు ఎలా ఉండాలో కరుణానిధి గొప్పగా చెప్పారని, అటువంటి లక్షణాలేవీ మోదీలో లేనందునే ఈ వేషం వేసినట్లు చెప్పారు. శివప్రసాద్‌తో మిగిలిన ఎంపీలు కూడా గళం కలిపారు. కేంద్రం కావాలనే రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.

More Telugu News