Karnataka: కర్ణాటకలో పరువు హత్య.. కుమార్తె, అల్లుడిని కత్తులతో పొడిచి నదిలో పడేసిన తల్లిదండ్రులు!

  • హోసూరు పట్టణంలో దారుణం
  • కులాంతర వివాహం చేసుకున్న యువతి
  • పోలీసులకు లొంగిపోయిన అమ్మాయి తండ్రి

పరాయి కులం వాడిని పెళ్లి చేసుకుందన్న ఆగ్రహం కన్నకుమార్తెపై ప్రేమను చంపేసింది. కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందని భావించిన తల్లిదండ్రులు తమ కూతురితో పాటు అల్లుడిని సైతం కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. అనంతరం వారిద్దరిని కాళ్లుచేతులు కట్టేసి నదిలో పడేశారు. ఈ ఈ పరువు హత్య ఘటన కర్ణాటకలోని హోసూరులో చోటుచేసుకుంది.

హోసూరు-బేరికె రహదారిలోని వెంకటేషపురం చూడగొండపల్లి గ్రామానికి చెందిన నందీశ్(25) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన స్వాతి(21)తో అతనికి పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని నందీశ్, స్వాతి తమ ఇంట్లో వాళ్లకు తెలిపారు. అయితే ఇరువురి కులాలు వేరుకావడంతో స్వాతి తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించలేదు. దీంతో కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా స్వాతి 3 నెలల క్రితం నందీశ్ ను పెళ్లి చేసుకుంది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్వాతి కుటుంబ సభ్యులు ఆమెను చంపేయాలని ప్రణాళిక వేశారు. కాగా నాలుగు రోజుల క్రితం నందీశ్-స్వాతి దంపతులు తాము ఉంటున్న ఇంట్లో నుంచి అదృశ్యమయ్యారు. దీంతో నందీశ్ సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు మాండ్య జిల్లా మల్లహళ్ళి శివారులోని కావేరి నదిలో విగతజీవులుగా ఉన్న ఓ జంటను గుర్తించారు.

వీరు కనిపించకుండా పోయిన నందీశ్, స్వాతిలేనని పోలీస్ అధికారులు నిర్ధారించారు. వీరిని కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం శవాలు దొరక్కుండా నదిలో పడేశారన్నారు. కాగా, ఈ జంట హత్యల నేపథ్యంలో యువతి తండ్రి సహా ముగ్గురు  నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ హత్యకు కుట్ర పన్ని పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం అధికారులు గాలిస్తున్నారు.

More Telugu News