ap bjp: కన్నా లక్ష్మీనారాయణ పెద్ద అవినీతిపరుడు: టీడీపీ నేత రాయపాటి ఆరోపణ

  • రేకుల షెడ్డులో ఉండే కన్నాకు వేల కోట్లు ఎక్కడివి?
  • చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత ఆయనకు లేదు
  • మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు తీవ్ర ఆరోపణలు చేశారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కన్నా లక్ష్మీనారాయణ పెద్ద అవినీతి పరుడని,   రేకుల షెడ్డులో ఉండే ఆయనకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత ఆయనకు లేదని హితవు పలికారు. అవినీతి పరుడైన కన్నాను ఆ పార్టీ అధ్యక్షుడిగా చేయడంతో బీజేపీ అవినీతి బయటపడిందని విమర్శించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్-టీడీపీ పొత్తు గురించి ఆయన ప్రస్తావిస్తూ, మోదీని ఇంటికి పంపాలన్న ఉద్దేశంతోనే ఈ దోస్తీ కట్టామని చెప్పారు. ఈ పొత్తు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమని అన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను, తన కుమారుడు ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమేనని అన్నారు. చంద్రబాబు సూచనల మేరకు పోటీ చేస్తామని అన్నారు.

వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో తాగు నీటి సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. ఈ నెలాఖరులోగా గ్రిడ్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ, దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం కూడా అందించలేదని, ఏపీపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏపీని అభివృద్ధి పథంలో నడపగలిగే వ్యక్తి చంద్రబాబు అని రాయపాటి స్పష్టం చేశారు.

More Telugu News