Telangana: హైదరాబాద్ లో కుటుంబ కలహాలతో భార్యను కిరాతకంగా హతమార్చిన యువకుడు!

  • జగద్గిరిగుట్టలోని డాల్ఫిన్ అపార్ట్ మెంట్ లో ఘటన
  • ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న దంపతులు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఛిద్రమయిపోయింది. భార్య మాటిమాటికి గొడవ పడటంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆమెను అత్యంత కిరాతకంగా హత్యచేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లా రామాపురానికి చెందిన వెంకటేశ్(24), లక్ష్మి(20)లు మూడు నెలల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు. వెంకటేశ్ స్థానికంగా ఉన్న బాలాజీ లేఅవుట్ డాల్ఫిన్ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే చాలీచాలని జీతం వస్తుండటంతో ఈ దంపతులు తరచూ గొడవపడేవారు.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వెంకటేశ్ పూటుగా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. దీంతో లక్ష్మి అతనితో గొడవకు దిగింది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన వెంకటేశ్ పక్కనే ఉన్న చున్నీని లక్ష్మి గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News