Srikakulam District: శ్రీకాకుళం టీడీపీ నేత జోగారావుపై కత్తులతో దాడి.. వైసీపీ పనే అంటున్న కుటుంబ సభ్యులు!

  • జోగారావుపై కత్తులతో దాడి చేసిన దుండగులు
  • తుపాను సహాయక చర్యల పర్యవేక్షణకు వెళ్లి వస్తుండగా ఘటన
  • ఆసుపత్రిలో పరామర్శించిన పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ

తిత్లీ తుపాను సహాయక చర్యల పర్యవేక్షణకు వెళ్లి వస్తున్న టీడీపీ నేతపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన టీడీపీ నేత చావుబతుకులతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ఉపాధ్యక్షుడు మదనాల జోగారావు ఆదివారం తుపాను సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన జోగారావును తొలుత పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు.

జోగారావుపై దాడిచేసింది వైసీపీ నేతలేనని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ ఆసుపత్రిలో జోగారావును పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News