france: అంతర్జాతీయ వేదికపై అదరగొట్టిన ‘అరకు’ కాఫీ.. బంగారు బహుమతి కైవసం!

  • ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన పోటీ
  • ప్రిక్స్ ఎపిక్యురెస్ ఓఆర్-2018 పోటీలో తొలిస్థానం
  • ప్రమోట్ చేస్తున్న ఆనంద్ మహీంద్రా

రుచి, సువాసనలో సాటిలేని అరకు కాఫీకి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ లోని అరకులోయలో గిరిజన రైతులు పండించే ఈ కాఫీ 'ప్రిక్స్ ఎపిక్యురెస్ ఓఆర్-2018' పోటీలో బంగారు బహుమతిని గెలుచుకుంది. ఫ్రాన్స్ లోని పారిస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

గతేడాది ఈ కాఫీ పొడిని ఫ్రాన్స్ లో అమ్మడం ప్రారంభించారు. తాజా అవార్డుతో అరకు కాఫీ కొలంబో, సుమత్రా వంటి ప్రసిద్ధ కాఫీ గింజల సరసన చేరింది. అరకు కాఫీ బ్రాండ్ ను మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా డైరెక్టర్ గా ఉన్న ‘నాంది’ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తోంది. కేవలం గింజలే కాకుండా కాఫీ ఆకులతో సైతం అరకు రైతులు అదనపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు.

నేచురల్ ఫార్మసీ ఇండియా అనే సంస్థ ‘అరకు చాయ్’ పేరుతో కెఫిన్ తక్కువగా, కృత్రిమ రుచులకు దూరంగా ఉండేలా గ్రీన్ టీని తయారుచేస్తోంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. పాలు, పంచదార కలపాల్సిన అవసరం లేకుండా కప్పు వేడినీటిలో ఈ టీ పొడి పొట్లాన్ని ముంచి తాగేయవచ్చని నేచురల్ ఫార్మసీ ఇండియా ప్రతినిధి రామన్ మాదాల తెలిపారు.

More Telugu News