Telangana: కాలర్ పట్టుకున్న టీటీఈ.. అదుపుతప్పి పట్టాలకింద పడి యువకుడి దుర్మరణం!

  • వికారాబాద్ జిల్లాలో ఘటన
  • టీటీఈని చావబాదిన ప్రయాణికులు
  • టికెట్ లేకుండా వెళుతున్న యువకుడు

టికెట్ లేని ప్రయాణం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. టీటీఈని గమనించిన ఓ యువకుడు ట్రైన్ నుంచి దూకేయబోగా ఆ అధికారి అతని కాలర్ పట్టుకున్నాడు. దీంతో అదుపు తప్పిన యువకుడు రైలు పట్టాలపై పడిపోయాడు. అతనిపై నుంచి రైలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వికారాబాద్ జిల్లాలోని తాండూరు నుంచి నాంపల్లి వరకూ రోజూ ప్యాసింజర్ రైలు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఈ రోజు టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కాడు. తనిఖీలకు వచ్చిన టీటీఈని గమనించిన యువకుడు రైలు దిగేందుకు యత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన టీటీఈ.. అతని చొక్కా కాలర్ ను పట్టుకున్నాడు. ఇంతలో రైలు కదలడంతో అదుపుతప్పిన ఆ యువకుడు రైలు, పట్టాల మధ్యలో పడిపోయాడు. వెంటనే అతని పైనుంచి రైలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ ఘటనతో ఆగ్రహోద్రులైన ప్రయాణికులు టీటీఈని చితకబాదారు. ఇతనికి మద్దతుగా అక్కడికి వచ్చిన మరో ముగ్గురు టీటీఈలను కూడా కొట్టారు. కాగా, చనిపోయిన యువకుడు తాండూరుకు చెందినవాడేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News