aravind swamy: అరవింద స్వామికి పారితోషికం ఎగ్గొట్టిన నిర్మాత.. కోర్టును ఆశ్రయించిన నటుడు!

  • చదురంగవేట్టై-2లో నటించిన అరవింద స్వామి
  • భారీగా బాకీపడ్డ నిర్మాత
  • మద్రాస్ హైకోర్టులో నటుడి పిటిషన్

ప్రముఖ నటుడు అరవింద స్వామి న్యాయస్థానం మెట్లు ఎక్కారు. ఓ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని నిర్మాత ఇవ్వకపోవడంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై అరవింద స్వామి న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ ‘చదురంగవేట్టై-2’ సినిమాలో హీరోయిన్ త్రిషతో కలిసి నటించారని తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత మనోబాల ప్రొడ్యూసర్ గా వ్యవహరించారని అన్నారు.

ఈ సినిమా కోసం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మనోబాల తన క్లయింట్ కు ఇంకా రూ.1.79 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు సంప్రదించినా స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించామన్నారు. తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని 18 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. మరోవైపు అరవింద స్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సుందర్ .. ఈ విషయమై సెప్టెంబర్ 20 లోపు స్పందించాలని మనోబాలకు నోటీసులు జారీచేశారు.

More Telugu News