polavaram: నిధులు ఇవ్వకుండా పోలవరం నిర్మించమంటే ఎలా?: అయ్యన్నపాత్రుడు

  • కేంద్రం నిధులివ్వడం లేదని మండిపాటు
  • బీజేపీ నేతలు గతంలో ఇదే ప్రాజెక్టులను పొగిడారని వ్యాఖ్య
  • టీవీ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి

పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న పురోగతిని చూసి కేంద్రం నిధులు కేటాయించాలని ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. కేవలం చంద్రబాబు కారణంగానే పోలవరం కల సాకారమయిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని అయ్యన్న దుయ్యబట్టారు. ఈ రోజు ఓ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అసలు కేంద్రం నిధులు విడుదల చేయకుంటే ప్రాజెక్టులను ఎలా నిర్మిస్తామని అయ్యన్న ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి అనీ, దాని కారణంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఏపీ ప్రభుత్వం పోలవరంలో గ్యాలరీ వాక్ ను ప్రారంభించనుందని మంత్రి చెప్పారు. గ్యాలరీ వాక్ ప్రారంభం కావడం అంటే ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దగ్గరగా వచ్చేయడమేనని తెలిపారు. ప్రభుత్వంలో కలసి ఉన్నప్పుడు బీజేపీ నేతలు పోలవరం, పట్టీసీమ ప్రాజెక్టులను పొగిడారనీ, ఇప్పుడేమో విమర్శలకు దిగుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

More Telugu News