saudi princess: పారిస్‌ హోటల్ నుంచి 9.30 లక్షల డాలర్ల విలువైన సౌదీ యువరాణి నగలు మాయం!

  • పారిస్‌లోని రిట్జ్ హోటల్‌లో ఘటన
  • హోటల్‌లో పరిపాటిగా మారిన దోపిడీలు
  • రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ కూడా బాధితురాలే

పారిస్‌లోని రిట్జ్ హోటల్‌లోని తన సూట్ నుంచి 8 లక్షల యూరోల (9.30 లక్షల డాలర్లు) విలువైన బంగారు నగలు అపహరణకు గురైనట్టు సౌదీ యువరాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. నగలు శుక్రవారమే అపహరణకు గురైనట్టు తెలుస్తోంది. అయితే, గది తలుపులు బద్దలుకొట్టినట్టు లేకపోవడంతో చోరీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, హోటల్‌లో యువరాణి నగలు చోరీకి గురైనట్టు వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించడానికి రిట్జ్ హోటల్ అధికారిక ప్రతినిధి నిరాకరించారు.

ఒకవేళ దోపిడీ కనుక నిజమైతే ఈ హోటల్‌లో ఈ ఏడాది జరిగిన రెండో అతిపెద్ద దోపిడీ ఇదే కానుంది. జనవరిలో హోటల్‌లోకి ప్రవేశించిన దొంగలు ఓ షోకేస్‌లో ప్రదర్శించిన మిలియన్ డాలర్ల విలువైన నెక్లెస్‌లు, ఇతర వజ్రాభరణాలను దోచుకున్నారు. అయితే దోపిడీ దొంగల్లో ముగ్గురిని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు తప్పించుకున్నారు. నగలను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబరు 2016లో రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ నగలు కూడా ఇదే హోటల్‌లో అపహరణకు గురయ్యాయి.

More Telugu News