Sunny Leone: కేరళకు సన్నీ లియోన్ 5 కోట్లు సాయం చేసిందంటూ ప్రచారం.. వాస్తవం మాత్రం ఇది!

  • కేరళకు 1200 కేజీల రైస్, పప్పు పంపిన సన్నీ
  • బాధితులకు ఇంకా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్న నటి
  • కేరళ ప్రజలకు ఏమి అవసరమో మాకు తెలుసు

కేరళ వరద బాధితులకు బాలీవుడ్ తార సన్నీ లియోన్ రూ. 5 కోట్లు సాయం చేసిందనే వార్త సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అయింది. ఈ వార్తను తొలుత ఎవరు పోస్ట్ చేశారో కానీ... జనాలు మాత్రం అది నిజమో, అబద్ధమో అనే ఆలోచన లేకుండానే తమ వంతుగా ఫుల్ పబ్లిసిటీ ఇచ్చేశారు. తీరా అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. కేరళకు తాము అందిస్తున్న సాయంపై సన్నీ స్పందించింది. తన భర్త డానియెల్ వెబర్, మరికొంత మంది బాలీవుడ్ మిత్రుల సాయంతో కేరళకు 1200 కేజీల రైస్, పప్పును పంపినట్టు తెలిపింది.

తాను, తన భర్త కలసి ఈ రోజు కేరళలోని కొంత మందికి ఆహారం అందించగలుగుతున్నామని సన్నీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళ ప్రజలకు ఏమి అవసరమో తమకు తెలుసని... వారికి ఇంకా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ముంబైలోని జుహులో కేరళ బాధితుల కోసం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, విరాళాలు సేకరించిన సిద్ధార్థ్ కపూర్, ప్రతీక్, సువేద్ లోహియాలు చాలా గొప్పవారంటూ కితాబిచ్చింది. 

More Telugu News