galla jayadev: తనకు మరో అరగంట సమయం కావాలన్న గల్లా.. ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తానన్న స్పీకర్!

  • ఇచ్చిన సమయానికి మించి కొనసాగుతున్న గల్లా ప్రసంగం
  • ఇంకెంత సమయం కావాలంటూ ప్రశ్నించిన స్పీకర్
  • అన్నీ వివరించాలంటే మరో అరగంట కావాలని చెప్పిన గల్లా

అవిశ్వాసంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేవలం 13 నిమిషాలు మాత్రమే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీకి జరిగిన అన్యాయానికి సంబంధించి అంశాల వారీగా గల్లా జయదేవ్ సభలో వివరిస్తున్నారు. విభజన వల్ల తెలంగాణకు కలిగిన లబ్ధి, ఏపీకి జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వ ద్రోహం గురించి ఆయన పలు అంశాలను లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో టీడీపీకి ఇచ్చిన సమయం ఎప్పుడో అయిపోయింది. గల్లా ప్రసంగం మాత్రం అనర్గళంగా కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రామహాజన్ కలగజేసుకుని ఇంకా ఎంతసేపు మాట్లాడతారని ప్రశ్నించారు. ఇంకెంత సమయం కావాలని అడిగారు. దీనికి సమాధానంగా, ఇది చాలా కీలకమైన సమావేశమని, తాము చెప్పుకోవాల్సింది చాలా ఉందని, అన్నీ వివరించడానికి తనకు మరో అరగంట సమయం కావాలని కోరారు. అంత సమయం ఇవ్వడం కుదరదని, ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇస్తానని స్పీకర్ చెప్పారు. దీనికి సమాధానంగా, అవిశ్వాసంపై తీర్మానానికి సంబంధించి గంట కన్నా తక్కువ సమయంలో తమ సమస్యలను చెప్పుకోవడం వీలుకాదని గల్లా అన్నారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

More Telugu News