vinod: హైదరాబాద్ పరిశ్రమలు విజయవాడకు తరలిపోయే ప్రమాదం ఉంది: టీఆర్ఎస్ ఎంపీ వినోద్

  • విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా లేదు
  • ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది
  • అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ కోరడం అర్థరహితం

ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం విభజన చట్టంలో లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనిదాన్ని ఏపీ కోరడం సరికాదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని... హైదరాబాదులోని పరిశ్రమలు విజయవాడకు తరలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని లేఖలో కోరారని చెప్పారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అదే విధంగా స్పందించారని తెలిపారు.

అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తమను టీడీపీ డిమాండ్ చేయడంలో అర్థం లేదని... నాలుగేళ్ల పాటు టీడీపీ, బీజేపీలు కలసి ఉన్నప్పుడు తాము దాని గురించి అడగలేదని వినోద్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చను తాము తెలంగాణ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటామని తెలిపారు. కేంద్ర మంత్రులు సహకరిస్తేనే రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోగలుగుతామని... కేంద్రంపై అవిశ్వాసం పెడితే రాష్ట్రానికే నష్టమని చెప్పారు.  

More Telugu News