Chandrababu: వాళ్ల ఆస్తులు వేలం వేస్తున్నారుగా.. మరి జగన్‌వి ఎందుకేయరు?: చంద్రబాబు

  • నీరవ్ మోదీ కంటే జగన్‌ది పెద్ద మోసం
  • అవినీతితో ఆస్తులు పోగేశారు
  • ఐదుగురు ఎంపీలను అడ్డం పెట్టుకుని డ్రామాలు

అగ్రిగోల్డ్, నీర‌వ్ మోదీ నేరాల కంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాలు తక్కువేం కాదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. వారి ఆస్తులను వేలం వేస్తున్నప్పుడు, జగన్ ఆస్తులను ఎందుకు వేయరని ప్రశ్నించారు. తామైతే న్యాయస్థానం ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేస్తున్నట్టు చెప్పారు. ఆ సంస్థ అప్పులు చేసి ఆస్తులు సమకూర్చుకుందని, కానీ వాటిని తీర్చలేదని పేర్కొన్నారు. దీంతో, వారి వ్యక్తిగత ఆస్తులను కూడా వేలం వేస్తున్నట్టు చెప్పారు. జగన్ చేసిందీ అదేనని, అతడిదీ మోసమేనని పేర్కొన్నారు.

నీరవ్ మోదీ కంటే జగన్ తక్కువేం కాదన్న సీఎం, అవినీతితో ఆస్తులు పోగేశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై తాము పోరాడుతుంటే, జగన్‌పై ఉన్న అవినీతి కేసులను కేంద్రం నీరుగారుస్తోందని ఆరోపించారు. కేవలం ఐదుగురు ఎంపీలను అడ్డం పెట్టుకుని జగన్ కేంద్రంతో బేరాలాడి కేసుల మాఫీకి కుమ్మక్కయ్యారన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన మోసానికి ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని చంద్రబాబు హెచ్చరించారు.

More Telugu News