Jyoti: బ్యూటీషియన్ జ్యోతి మృతి తరువాత కనిపించకుండా పోయిన ప్రియుడు సందీప్!

  • రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన జ్యోతి
  • మైలారం వద్ద రైల్వే పట్టాల పక్కన మృతదేహం
  • కనిపించకుండా పోయిన ప్రియుడు సందీప్
  • సెల్ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా పోలీసుల గాలింపు

రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి రైలులో వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన బ్యూటీషియన్ జ్యోతి, తాండూరుకు రెండు స్టేషన్లు ముందు మైలారం సమీపంలో రైలు పట్టాలపక్కన విగతజీవిగా కనిపించిన కేసులో ప్రధాన అనుమానితుడు, జ్యోతి ప్రియుడు సందీప్ కనిపించకుండా పోయాడు. తాను జ్యోతి సెల్ ఫోన్ కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోందని, నిన్న ఉదయం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పిన సందీప్, ఆపై ఆచూకీ లేకుండా పోయాడు. ఈ కేసులో తాము సందీప్ నే అనుమానిస్తున్నామని, అతను స్వయంగా మాకు ఫోన్ చేయడంతోనే తమకు అనుమానం వచ్చిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇక సందీప్ సెల్ ఫోన్ ను ట్రాకింగ్ లో పెట్టిన పోలీసులు, సాధ్యమైనంత త్వరగా అతన్ని అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలు అనుమానాలు తలెత్తగా, ఆమె పనిచేస్తున్న లింగంపల్లిలోని 'గ్రీన్ ట్రెండ్స్' ఉద్యోగులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆదివారం రాత్రి పట్టాల పక్కన జ్యోతి కొన ప్రాణాలతో కనిపించగా, రైల్వే సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదని, చివరకు ఉదయానికి ఆమె ప్రాణాలు పోయాయని కుటుంబీకులు ఫిర్యాదు ఆరోపిస్తుండగా, పోలీసులు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంపైనా కేసు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News