banks: ఖాతాదారులను బాదుతూ కాసులు కురిపించుకుంటున్న బ్యాంకులు

  • ఎస్ఎంఎస్ అలర్ట్ ల పేరుతో చార్జీలు
  • ప్రతీ మూడు నెలలకు రూ.17పైనే భారం
  • చిన్న ఖాతాలకూ తప్పని చార్జీల బెడద

రిజర్వ్ బ్యాంకు ఆదేశాలను ఆసరాగా చేసుకుని బ్యాంకులు ఖాతాదారుల నుంచి కాసులు రాల్చుకుంటున్నాయి. ఏటీఎం, డెబిట్ కార్డు, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ లావాదేవీల వివరాలను ఎస్ఎంఎస్ అలర్ట్స్ రూపంలో ఖాతాదారులకు తెలియజేయాలని, దాంతో మోసాల నివారణకు వీలు పడుతుందని, లావాదేవీలో పొరపాట్లు, మోసాలు జరిగితే తెలుసుకుంటారని ఆర్ బీఐ బ్యాంకులను ఆదేశించింది.

 దీంతో ఇప్పుడు అన్ని బ్యాంకులు ఖాతాదారులకు లావాదేవీల వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తున్నాయి. ఇందుకు గాను ప్రతీ మూడు నెలలకు రూ.15 చొప్పున వసూలు చేస్తున్నాయి. దీనికి పన్ను కూడా కలుపుకుంటే రూ.17పైనే అవుతోంది. మరి ఎక్కువ లావాదేవీలు చేసే వారికి, పెద్ద ఖాతాదారులకు ఇదేమంత భారం కాకపోవచ్చు. కానీ నామమాత్రపు ఖాతాలు, లావాదేవీలు చేసే వారికి ఇది భారమే.

అయితే, ఆర్ బీఐ వాస్తవ వినియోగం ఆధారంగానే చార్జీలు విధించాలని కోరింది. దీనివల్ల ఖాతాదారులపై పెద్ద భారం పడదని ఆశించింది. కానీ, బ్యాంకులు మాత్రం ఆర్ బీఐ మార్గదర్శకాలను పట్టించుకోకుండా తాము అనుకున్న మేర చార్జీలను విధిస్తూనే ఉన్నాయి. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనేనని బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఏసీ మహాజన్ అన్నారు. 48 బ్యాంకుల్లో 19 బ్యాంకులు త్రైమాసికం వారీగా రూ.15 చొప్పున చార్జ్ చేస్తున్నాయి. తక్కువ నిల్వలు ఉండి, తక్కువ లావాదేవీలు నిర్వహించే వారిపై చార్జీల భారం మోపరాదని మహాజన్ అన్నారు.

More Telugu News