Vijayawada: టెక్కీ తేజస్విని బ్రెయిన్ డెడ్... స్పష్టం చేసిన విజయవాడ వైద్యులు!

  • యాక్సిడెంట్ తో తీవ్ర గాయాల పాలైన తేజస్విని
  • చిన్న మెదడుకు బలమైన గాయం
  • ఆమె ఎప్పటికీ స్పృహలోకి రాదన్న వైద్యులు

తప్పతాగిన ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు చేసిన యాక్సిడెంట్ తో తీవ్ర గాయాల పాలైన విజయవాడ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తేజస్విని బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు స్పష్టం చేశారు. ప్రమాదంలో ఆమె చిన్న మెదడుకు బలమైన గాయం అయిందని, అదిక మానదని వెల్లడించారు. ఆమె ఇక ఎప్పటికీ స్పృహలోకి రాదని తేల్చారు. కాగా, కానిస్టేబుల్ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ సీపీ గౌతమ్ సవాంగ్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు వెలువరించారు.

మరోపక్క, సూర్యారావు పేట పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని కేసు విచారణ సాగుతోందని తెలిపారు. తేజస్విని కుటుంబ సభ్యులను పరామర్శించిన సవాంగ్, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. కాగా, త్వరలో వివాహం జరగాల్సిన తేజస్విని ప్రస్తుతం చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ, వివాహ షాపింగ్ నిమిత్తం సోదరుడితో కలసి వెళ్లి వస్తుంటే, శ్రీనివాసరావు యాక్సిడెంట్ చేశాడు. ఈ ప్రమాదంలో ఆమె తల డివైడర్ కు బలంగా ఢీకొనగా, వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు.

More Telugu News