Satabdhi trains: అటెన్షన్ టు ప్యాసింజర్స్....శతాబ్ది రైళ్లలో ప్రయాణం ఇక భారం కాదు...!

  • శతాబ్ది రైళ్ల ఛార్జీలను తగ్గించనున్న రైల్వే శాఖ
  • బెంగళూరు-మైసూరు స్టేషన్ల మధ్య ఛార్జీల తగ్గింపుతో సత్ఫలితాలు
  • ఇతర మార్గాలకు విస్తరిస్తామని వెల్లడి..దేశవ్యాప్తంగా 45 శతాబ్ది రైళ్లు

అధిక ఛార్జీల కారణంగా శతాబ్ది రైళ్లలో ప్రయాణం చేయాలంటే చాలామంది మధ్యతరగతి ప్రయాణికులు వెనుకాడేవారు. కానీ, ఈ ఛార్జీలు భారీగా తగ్గనున్నాయి. దీంతో ఇకపై వీటిలో ప్రయాణం అంత భారం కాబోదు. ఎంపిక చేసిన మార్గాల్లో ఛార్జీలను రైల్వే శాఖ తగ్గించనుంది. ప్రయాణికుల శాతం తక్కువగా ఉన్న 25 రైళ్లను గుర్తించామని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది ప్రయోగాత్మకంగా రెండు మార్గాల్లో ఛార్జీలను తగ్గించగా సత్ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. అందువల్ల ఈ పథకాన్ని విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా 45 వరకు శతాబ్ది రైళ్లున్నాయి. వీటిలో ఢిల్లీ-అజ్మీర్, చెన్నై-మైసూర్ మధ్య నడిచే రైళ్లలో కొన్ని స్టేషన్ల మధ్య గతేడాది ప్రయోగాత్మకంగా ఛార్జీలను తగ్గించారు. కాగా, బెంగళూరు-మైసూరు స్టేషన్ల మధ్య ప్రయాణికుల శాతం బాగా తక్కువగా నమోదయ్యేది. ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపేవారు. ఈ విషయం తెలుకున్న రైల్వే శాఖ... ఈ స్టేషన్ల మధ్య శతాబ్ది రైళ్ల ఛార్జీలను బస్సు ఛార్జీలతో సమానం చేసింది. దీంతో బెంగళూరు-మైసూరు స్టేషన్ల మధ్య ప్రయాణికుల సంఖ్య 63 శాతం మేర పెరిగింది. ఈ కారణంగా ఈ పథకాన్ని మరిన్ని మార్గాల్లో విస్తరించడానికి రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది.

More Telugu News