BJP: దారుణం....రాంచీలో పట్టపగలే బీజేపీ నేత కాల్చివేత

  • దుండగులు తలపై కాల్చడంతో బీజేపీ నేత స్పాట్‌లో మృతి
  • భూతగాదాలే కారణమై ఉండొచ్చని పోలీసుల అనుమానం
  • నిందితులను అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్

లోహర్‌దాగాకి చెందిన బీజేపీ నేత పంకజ్ గుప్తాని గుర్తుతెలియని వ్యక్తులు ఈ రోజు రాంచీలో కాల్చిచంపారు. వివరాల్లోకెళితే....దుండగులు పంకజ్ తలపై కాల్చడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన పిస్కా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. బాధితుడు రైలు నుంచి కిందికి దిగీదిగగానే దుండగులు తనని కాల్చి చంపారు. స్టేషన్‌ వద్ద ఉన్న రామ్‌లాల్ స్వీట్స్‌కి సమీపంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించినట్లు తెలిసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు స్టేషన్‌కి సమీపంలోని రహదారులను దిగ్బంధించారు. పట్టపగలే ఇలాంటి దారుణం జరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల కోసం అన్వేషిస్తున్నామని, వారిని పట్టుకుని తీరుతామని పోలీసులు వెల్లడించారు. పిస్కాలో గుప్తా ఓ భూమిని కొన్నట్లు తెలిసింది. అక్కడ నిర్మాణం కోసం తాను తరచూ అక్కడికి వచ్చివెళ్లేవారు. అందువల్ల భూతగాదాలే  ఈ దారుణానికి కారణమై ఉండొచ్చనే కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

More Telugu News