Padmaavat: అజయ్ దేవగణ్ థియేటర్ పై దాడి చేసిన రాజ్ పుత్ కర్ణి సేన కార్యకర్తలు!

  • సంజయ్ లీలా భన్సాలీ ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ లో నటించిన అజయ్ దేవగణ్
  • గత అక్టోబర్ లో ఉత్తరప్రదేశ్ లో నాలుగు థియేటర్లను కొనుగోలు చేసిన అజయ్  
  • ‘పద్మావత్‌’ సినిమాను ప్రదర్శించడంతో థియేటర్ ను తగులబెట్టిన రాజ్ పుత్ కర్ణిసేన కార్యకర్తలు

‘పద్మావత్‌’ సినిమాపై రాజ్‌ పుత్‌ కర్ణిసేన కార్యకర్తల నిరసన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీపిక ముక్కు, చెవులకు వెలకట్టిన రాజ్ పుత్ లు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కూడా వెలకట్టారు. సోషల్ మీడియాలో రాజ్ పుత్ కర్ణిసేన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆందోళనకారులు వెనక్కితగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కు చెందిన థియేటర్‌ ను తగులబెట్టారు. ఉత్తరప్రదేశ్ లో గత అక్టోబర్ లో నాలుగు థియేటర్లను అజయ్ దేవగణ్ కొనుగోలు చేశారు. వీటిని మల్టీప్లెక్స్ లుగా మార్చాలని భావించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ‘పద్మావత్‌’ సినిమాను ప్రదర్శించినందుకుగాను హపూర్‌ లోని థియేటర్‌ ను కర్ణిసేన కార్యకర్తలు తగులబెట్టారు.

తొలుత థియేటర్‌ మేనేజర్‌ తో సమావేశమయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ... దాడులు చేసే అవకాశముండడంతో ఆయన వారితో సమావేశం కాలేదు. దీంతో థియేటర్ ను తగులబెట్టారు. కాగా, అజయ్ దేవగణ్ గతంలో సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 

More Telugu News