KALA movie: 'కాలా' సినిమా వివాదం... రజనీకాంత్, ధనుష్ లకు మద్రాసు హైకోర్టు నోటీసులు!

  • కాలా కథపై తలెత్తిన వివాదం 
  • హైకోర్టులో సహాయ దర్శకుడు రాజశేఖరన్ పిటిషన్ 
  • ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలంటూ కోర్టు నోటీసులు 

'కాలా' సినిమా కథ, టైటిల్ తనదంటూ సహాయ దర్శకుడు రాజశేఖరన్ వేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు విచారించింది. 'కాలా కరికాలన్' అనే కథను పదేళ్ల క్రితం తాను రాసుకున్నానని, అందులో రజనీకాంత్ ను హీరోగా తీసుకోవాలని భావించానని చెప్పిన పిటిషనర్ వాదనను న్యాయస్థానం ఆలకించింది. ఈ క్రమంలో 'కాలా' పాత్రధారి రజనీకాంత్, నిర్మాత ధనుష్‌, దర్శకుడు పా రంజిత్‌, దక్షిణ చిత్ర పరిశ్రమ నటీనటుల సంఘంకు నోటీసులు పంపింది.

కాగా, ‘కాలా’ సినిమాపై 2017 అక్టోబర్ లో చెన్నై కోర్టును రాజశేఖరన్ ఆశ్రయించగా, అక్కడ విచారణ సందర్భంగా తమ సినిమా కథ పా రంజిత్‌ రాసినదని, పిటిషనర్ కథతో సంబంధం లేదని ధనుష్‌ ప్రొడక్షన్‌ సంస్థ వండర్‌ బార్‌ ఫిల్మ్స్‌ వివరణ ఇచ్చింది. అనంతరం ఈ పిటిషన్ ను హైకోర్టుకు తీసుకెళ్లమని సూచించడంతో పిటిషనర్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, దానిని స్వీకరించిన న్యాయస్థానం రజనీ, నిర్మాత, దర్శకుడ్ని ఫిబ్రవరి 12వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.  

More Telugu News