Pawan Kalyan: ఎవ‌రికి క్లారిటీ ఉందో, ఎవ‌రికి లేదో చూద్దాం!: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • అధికార కాంక్ష‌ వేరు.. ప్ర‌జ‌ల కోసం అసెంబ్లీకి వెళ్ల‌డం వేరు
  • పాతికేళ్లు రాజ‌కీయాల్లో ఉండ‌డానికి వ‌చ్చాను
  • ప్ర‌జ‌ల‌కు మంచి చేయాలి.. తదుపరి అనంతపురం వెళతా

పదవులపై ఆశ లేకపోతే ఇక ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకని సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కొందరు విమర్శిస్తోన్న నేపథ్యంలో ఆ విమర్శపై పవన్ స్పందించారు. అధికార కాంక్ష‌ వేరు, ప్ర‌జ‌ల కోసం అసెంబ్లీకి వెళ్ల‌డం వేర‌ని అన్నారు. మూడు రోజులపాటు తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... రాజ‌కీయాల్లో త‌న‌కు క్లారిటీ లేదంటూ కొంద‌రు చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను ఖండించారు.

'మున్ముందు చూద్దాం.. ఎవ‌రికి క్లారిటీ ఉందో, ఎవరికి లేదో' అని అన్నారు. తాను పాతికేళ్లు రాజ‌కీయాల్లో ఉండ‌డానికి వ‌చ్చాన‌ని అన్నారు. రాజ‌కీయం అంటే ప్ర‌త్య‌ర్థుల‌ను విమ‌ర్శించ‌డం మాత్ర‌మే కాద‌ని, ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని హిత‌వు ప‌లికారు. తాను త‌దుప‌రి అనంత‌పురం బ‌య‌లుదేర‌తాన‌ని చెప్పారు. అక్క‌డి ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేస్తాన‌ని తెలిపారు.     

More Telugu News