vangala rajeshwari: వైఎస్ జగన్ పై వైకాపా ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి చేసిన ఆరోపణలివే!

  • అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం నచ్చలేదు
  • నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు
  • చంద్రబాబు కష్టించి పనిచేస్తున్నారు
  • త్వరలో ప్రజలకు విషయాలు చెబుతానన్న రాజేశ్వరి

తమ పార్టీ అధినేత వైఎస్ జగన్, అసెంబ్లీకి వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయం తనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలకు నచ్చలేదని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. ఈ ఉదయం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె, మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీని బహిష్కరించడం సరికాదని వ్యాఖ్యానించిన ఆమె, తన నియోజకవర్గం ఎన్నో సమస్యల్లో ఉందని, వాటిని అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కార మార్గాలు వెతుకుతానని తెలిపారు.

తాను అసెంబ్లీకి వెళతానని చెప్పారు. తన నియోజకవర్గంలో అధికంగా ఉన్న ఎస్టీలు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, దురదృష్టవశాత్తూ జగన్, తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోగా, సభలో తనకు ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. తన కార్యకర్తలతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నరే మిగిలున్న సమయంలో ఇలా అసెంబ్లీని బహిష్కరించుకుంటూ పోతే అభివృద్ధి ఎలా సాగుతుందని ప్రశ్నించారు. తనకు న్యాయం చేస్తానని, అడిగినవన్నీ ఇస్తానన్న భరోసాను చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గంలో త్వరలో బహిరంగ సభ పెట్టుకుని ప్రజలకు విషయాన్ని చెబుతానని అన్నారు.

More Telugu News