revant reddy: చంద్రబాబు ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్లడం ఎందుకన్న సహచరులు... మెత్తబడిన రేవంత్... ఎల్పీ భేటీ రద్దు!

  • గందరగోళ పరిస్థితిని కల్పించడం ఎందుకు
  • అనుచరుల సూచనలతో మనసు మార్చుకున్న రేవంత్
  • చంద్రబాబు వచ్చిన తరువాత తేల్చుకుంటానంటున్న రేవంత్

తెలుగుదేశం పార్టీ అధినేత విదేశాల్లో ఉన్న వేళ, ఆయన ఆదేశాలకు భిన్నంగా అడుగులు వేస్తే, మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని, ఆయనకు ఎదురు వెళుతున్నామన్న సంకేతాలను పంపడం ఎందుకని దగ్గరి అనుచరులు సలహా ఇవ్వడంతో రేవంత్ రెడ్డి మనసు మార్చుకున్నారు. ఈ ఉదయం అసెంబ్లీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించతలపెట్టిన తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

అంతకుముందు ఈ సమావేశం నిర్వహించే అర్హత రేవంత్ కు లేదని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై ఓ హోటల్ లో టీడీపీ- బీజేపీ భేటీకి ఎల్ రమణ, అసెంబ్లీలో ఎల్పీ సమావేశానికి రేవంత్ పిలుపు ఇవ్వడంతో వీరిమధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డట్లయింది. ఆపై ఎల్ రమణ, స్వయంగా చంద్రబాబుకు లేఖను రాస్తూ, రేవంత్ ను తప్పించాలని కోరగా, ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు, రేవంత్ హోదాలను తోలగిస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేత హోదాలో ముందుకెళ్లి, ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలైన ఆర్.కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్యలతో కలసి భేటీ అయితే, చంద్రబాబు ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్లినట్టు అవుతుంది. ఇక ఇదే విషయాన్ని ఆలోచించిన రేవంత్ ఈ భేటీని రద్దు చేసుకుని, చంద్రబాబు వచ్చిన తరువాత ఆయనతోనే డైరెక్టుగా మాట్లాడాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

More Telugu News