: గన్ మెన్ కాల్పులు జరపకపోతే నన్ను చంపేసేవారు!: నంద్యాల టీడీపీ నేత 'అభిరుచి' మధు

వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని నంద్యాల టీడీపీ నేత అభిరుచి మధు ఆరోపించారు. చనిపోయిన వ్యక్తిని కడసారి చూసి వస్తున్న తనపై పక్కా ప్లాన్ తో దాడి చేశారని చెప్పారు. రాళ్లు, బండలు, పెద్ద పెద్ద కర్రలతో చంపేందుకు ప్రయత్నించారని... ముమ్మాటికీ ఇది హత్యాయత్నమే అని అన్నారు. తాము కారులో ఉన్న సమయంలో రాళ్లను విసిరి, తమను బయటకు వచ్చేలా చేసి చంపాలనుకున్నారని చెప్పారు.

 ఆ సమయంలో తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరపకపోతే... తనను చంపేసేవారని తెలిపారు. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే పక్కనే ఉన్న కొబ్బరిబోండాం వ్యాపారి వద్ద ఉన్న కొడవలిని చేతిలోకి తీసుకున్నానని చెప్పారు. తనకు, శిల్పా కుటుంబానికి ఉన్న శత్రుత్వం కారణంగానే ఈ దాడి జరిగిందని మధు అన్నారు. తాను పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత కూడా శిల్పా చక్రపాణిరెడ్డి మనుషులు వచ్చి బెదిరించారని... 'నిన్ను కచ్చితంగా చంపేస్తాం' అని వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. నంద్యాలలో ఈ మధ్యాహ్నం శిల్పా, మధు వర్గీయుల మధ్య పరస్పర దాడి జరిగిన సంగతి తెలిసిందే.

More Telugu News