: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కన్నడ టీవీ సీరియల్ నటి, నటుడు!

కన్నడ టీవీ నటి, నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తూ 'మహానది', 'త్రివేణి సంగమ', 'మధుబాల' వంటి కన్నడ సీరియల్స్‌ లో ప్రధాన పాత్రలు పోషించిన రచన (23), జీవన్ (25) లు రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. కార్తిక్ అనే టీవీ నటుడి పుట్టినరోజును పురస్కరించుకుని, రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్‌, జీవన్, రచన బెంగుళూరు సమీపంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లారు.

కార్తీక్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించి, పార్టీ చేసుకున్నారు. తెల్లవారు జామున సఫారీలో బెంగళూరు తిరిగి ప్రయాణమయ్యారు. మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి వద్దకు రాగానే రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్‌ ను వారు ప్రయాణిస్తున్న సఫారీ ఢీకొట్టింది. వేగంగా వస్తూ ఢీ కొట్టడంతో రచన, జీవన్ అక్కడికక్కడే మృతి చెందగా, రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News