: పోల‌వ‌రంపై నేడు స‌మావేశం కానున్న అథారిటీ... కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం

కేంద్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో అమర్‌జిత్‌సింగ్ నేతృత్వంలో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌పై నేడు కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో కమిషనర్‌ కె.వోహ్రా, కేంద్ర జలసంఘం సభ్యుడు మసూద్‌ హుస్సేన్‌, సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ శ్రీవాత్సవ, పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్యా పాల్గొన‌నున్నారు. దాదాపు ఏడాది తర్వాత అమర్‌జిత్‌సింగ్ ప్రాజెక్టును సందర్శిస్తుండ‌టంతో ఈ స‌మావేశంలో ప్రాజెక్టుకు సంబంధించి కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కు ప్రాజెక్టులో 1055 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు జ‌ర‌గాల్సి ఉండ‌గా, 745 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పూర్తయింది. అలాగే స్పిల్‌ వే, స్టిల్లింగ్‌ బేసిన్‌ కాంక్రీటుకు సంబంధించి 16.04 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పనిలో 2.21 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. వీటితో పాటు మొత్తం 48గేట్ల ఫ్యాబ్రికేషన్, ప్రధాన డ్యాంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు పూర్త‌య్యాయి. ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం, ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శికి ఆర్థిక అధికారాల అప్పగింత‌, నిధుల ప్ర‌తిపాద‌న‌, నాణ్య‌త ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల కేటాయింపు వంటి అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

More Telugu News