: సీఎంగా చంద్రబాబు ఉండొద్దని పిటిషన్.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగడానికి వీల్లేదని... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలుపొందారని, చట్ట నిబంధనల ప్రకారం ఆయన ప్రమాణస్వీకారం చేయలేదంటూ ఇరు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విభజన చట్టం 2014 నిబంధనల ప్రకారం నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు కొనసాగడానికి వీల్లేదని పిటిషన్ దారుడు తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.రజనిలతో కూడిన ధర్మాసనం నిన్న విచారించింది. ఈ సందర్భంగా పిటిషన్ దారుడిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీబాధ్యతలను స్వీకరించి మూడేళ్లు దాటిపోయిందని, ఇంత వరకు ఏం చేస్తున్నారంటూ మండిపడింది. ఇంత కాలం తర్వాత కోర్టును ఆశ్రయించి, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రాజ్యాంగ సమ్మతం కాదనడం... ముమ్మాటికీ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది.

More Telugu News