: ఎక్కువ మార్కులొచ్చాయన్న ఆక్కసుతో స్నేహితురాలి వాటర్ బాటిల్ లో దోమల మందు కలిపిన బాలిక!

తన కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న బాలికపై తోటి బాలిక విషప్రయోగం చేసి, తరువాత భయంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని సత్నా పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక, తన కంటే ఎక్కువ మార్కులు సాధించిన సహవిద్యార్థిని, స్నేహితురాలిపై అక్కసు పెంచుకుంది. దీంతో ఆమె వాటర్ బాటిల్ లో దోమల నివారిణ మందును కలిపింది. ఆ నీరు తాగిన బాలిక వాంతులు చేసుకుంది. దీంతో బాలిక అస్వస్థతకు గురైందని స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో హుటాహుటీన వారు ఆసుపత్రిలో చేర్చారు.

ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే వైద్యులు బాలికపై విషప్రయోగం జరిగిందని చెప్పడంతో పాఠశాలలోని సీసీ పుటేజ్ లు పరిశీలించగా, అందులో ఈ ఘటనకు సంబంధించిన అన్ని దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో బాలిక నీళ్ల సీసాలో మందును కలపడం, అనంతరం దాన్ని మరో విద్యార్థిని బ్యాగులో దాచడం కనిపించింది. వెంటనే పోలీసులు బాలికను విచారించారు. దీంతో భయపడ్డ బాలిక ఇంట్లో అదే తరహా మందును తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 

More Telugu News