: కాలేజీకని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఇంటర్మీడియట్ విద్యార్థిని.. అనుమానాస్పద స్థితిలో మృతి
కాలేజీకని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని మామిడి తోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని లాబర గ్రామం ఎస్టీ కాలనీలో చోటు చేసుకుంది. తమ కూతురు అగదాల పార్వతి (18) సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె చిన్నాన్న ఇంటికి వెళ్లి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు భావించారు. అయితే, నాలుగు రోజులైనా పార్వతి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు.
చివరకు పార్వతి లాబరగ్రామం సింగుపురం జంక్షన్కు మధ్యలోగల మామిడితోటలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. పార్వతి ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో చంపేసి ఇలా వేలాడదీశారని, ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.