: ఇస్లాం కోసం త్యాగం చేయమన్నారు: ట్రిపుల్ తలాక్ పై తొలిసారి సుప్రీం గడపతొక్కిన షయిరా బానో

ముమ్మారు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో చట్టం చేసేందుకు కేంద్రానికి ఆరు నెలల గడువు ఇచ్చిన నేపథ్యంలో, తనకు జరిగిన అన్యాయంపై, భర్త చెప్పిన ట్రిపుల్ తలాక్ పై తొలిసారిగా అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కిన షయిరా బానో, మీడియా ముందుకు వచ్చారు. ఇస్లాం మతంలో వివాదాస్పదంగా ఉన్న తలాక్ నిబంధనలపై పోరాడుతున్న తనకు, ఎందరో ముస్లిం మత పెద్దల నుంచి ఒత్తిడి వచ్చిందని చెప్పారు.

తాను కేసును వెనక్కు తీసుకోవాలని, ఇస్లాం కోసం త్యాగం చేయాలని అడిగారని, ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. స్పీడ్ పోస్టులో తనకు తన భర్త తలాక్ అని మూడుసార్లు రాసిన కాగితం పంపి విడాకులు ఇచ్చాడని గుర్తు చేసిన ఆమె, ఇదే విషయాన్ని మత పెద్దల దృష్టికి తీసుకెళితే, తననే త్యాగం చేయమని కోరారని అన్నారు. కాగా, షయిరా తరువాత దుబాయ్ నుంచి ఫోన్లో తలాక్ చెప్పాడంటూ, జహాన్ అనే మహిళ కూడా సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆపై మరో ముగ్గురు కూడా తమకు అన్యాయం జరిగిందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అన్యాయానికి గురైన ముస్లిం మహిళలంతా, ఈ విషయంలో అన్ని రాష్ట్రాలూ స్పందించి చట్ట సవరణకు సహకరించాలని కోరుతున్నారు.

More Telugu News