: మణిపూర్ మాజీ సీఎం, తొలి పార్లమెంట్ ఎంపీ కైషింగ్ కన్నుమూత

రాజకీయ కురువృద్ధుడు, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి రిషాంగ్ కైషింగ్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడిపిన ఆయన, అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1972లో మణిపూర్ పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించిన కైషింగ్, ఆపై జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుంగ్యార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన 2002 వరకూ 7 సార్లు విజయం సాధించారు. 1975లో రాష్ట్ర మంత్రిగా, ఆపై 1980లో ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించారు.

స్వతంత్ర భారతావనిలో 1952లో ఏర్పడిన తొలి పార్లమెంటులో ఆయన సభ్యుడు కూడా. కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక కాలం పాటు సుదీర్ఘకాలం రాజ్యసభలో కనిపించిన వ్యక్తి కూడా ఆయనే కావడం గమనార్హం. మణిపూర్ సీఎం పదవిని తన రాజకీయ వారసులకు అప్పగించిన తరువాత, 2002లో పెద్దల సభకు ఎన్నికైన ఆయన, ఆపై 2008లో మరోసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికై 2014 వరకూ సేవలందించారు. అక్టోబర్ 25, 1920లో జన్మించిన ఆయన, తన జీవితం తొలినాళ్లలో ఉపాధ్యాయ వృత్తిలోనూ రాణించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.

More Telugu News