: అప్పుడు కుంబ్లేపై ఫిర్యాదు... ఇప్పుడు నైకీపై కంప్లైంట్ ... కోహ్లీయా మజాకానా?

టీమిండియాలో అకస్మాత్తుగా వెలుగు చూసిన వివాదం కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహారశైలిపై విమర్శలు కురిపించేలా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన అనంతరం జట్టు రాణిస్తోంది. ఈ నేపథ్యంలో అభిప్రాయ భేదాలతో మాజీ కోచ్ అనిల్ కుంబ్లేపై ఫిర్యాదు చేసి, అతని రాజీనామాకు కోహ్లీ కారణమయ్యాడంటూ మీడియాలో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా తన రెండో ఫిర్యాదును జట్టు అపెరల్ పార్టనర్ 'నైకీ'పై చేసింది. నైకీ 2006 నుంచి జెర్సీలు, షూస్ జట్టుకు అందిస్తోంది. ఇన్నేళ్లలో ఏ కెప్టెన్ కూడా బీసీసీఐకి నైకీపై ఫిర్యాదు చేసినట్టు వార్తలు రాలేదు. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే నేరుగా సంస్థకు చెప్పి, తమకు అనుకూలమైన కిట్లను తెప్పించుకునేవారు. అయితే తాజాగా జట్టు నైకీపై ఫిర్యాదు చేయడం వెనుక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యూహం కనిపిస్తోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

విరాట్ కోహ్లీ ఈ మధ్యే ప్యూమాతో 110 కోట్ల రూపాయల భారీ ఒప్పందాన్ని చేసుకున్న సంగతి తెలిసిందే. అది ఈ మధ్యే అమలులోకి వచ్చింది. ప్యూమాకు భారత్ లో పెద్దగా మార్కెట్ లేదు. భారత్ లో నైకీ, అడిడాస్ కు మంచి మార్కెట్ ఉంది. భారత మార్కెట్ లో పాగా వేయాలనుకుంటున్న ప్యూమా టీమిండియా కెప్టెన్ తో పావులు కదిపి, భారత్ లో పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నైకీపై టీమిండియా ఫిర్యాదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

భారత్ లో క్రికెట్ జట్టుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కోహ్లీకి ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. జట్టులో అతను ఏది చెబితే అది జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణే కుంబ్లే రాజీనామా అన్న సంగతి ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు. ఈ నేపథ్యంలో, నైకీని తప్పించేందుకు అవసరమైతే కాంట్రాక్టును రద్దు చేయవచ్చు అన్న క్లాజును ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. 2020 వరకు నైకీతో ఉన్న కాంట్రాక్టును రద్దు చేసుకుని ప్యూమాతో కొత్త కాంట్రాక్టును మరింత భారీ మొత్తానికి చేసుకునే అవకాశం కనిపిస్తోంది. భారీ మొత్తం అన్నది బీసీసీఐని ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

More Telugu News