: నంద్యాలలో శిల్పామోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం!

నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేపు జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండొద్దంటూ పోలీసులు ఆదేశించారు. తన సోదరుడు చక్రపాణి రెడ్డిని నంద్యాల వదిలి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో శిల్పామోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మోహన్ రెడ్డి  మాట్లాడుతూ, ఏజెంట్ ఫామ్ ల కోసం వచ్చిన వారిపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, ఆ ఫారాలను వారికి ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్ధరాత్రయినా, అపరాత్రయినా ఏజెంట్ ఫారాలను తమ వాళ్లకు అందజేస్తామని, ఇబ్బంది లేకుండా చూసుకుంటామని అన్నారు.

 కాగా, రేపు జరగనున్న ఉపఎన్నిక నేపథ్యంలో 255 కేంద్రాలలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సామాగ్రితో ఆయా కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటున్నారు. నంద్యాలలో ఆరు కంపెనీల కేంద్ర బలగాలను దింపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఫ్యాక్షన్ గ్రామాలపై పహారా మరింతగా పెంచారు. ఈ నేపథ్యంలో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, బాడీవేర్ కెమెరాలతో నిఘా ఉంచారు. నంద్యాలలో 107 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 

More Telugu News