: పాండిచ్చేరిలో క్యాంప్.. రిసార్టుకు బయల్దేరిన 22 మంది ఎమ్మెల్యేలు.. వేడెక్కిన తమిళ రాజకీయం!
తమిళ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. పళనిస్వామి, పన్నీర్ వర్గాలు ఏకమై శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి వెళ్లగొట్టాలని భావిస్తున్న తరుణంలో... అన్నాడీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తమను పార్టీకి దూరం చేస్తే, తమ తడాఖా ఏంటో చూపుతానంటూ గతంలోనే హెచ్చరించిన దినకరన్ అన్నంత పనీ చేస్తున్నారు. ఈ ఉదయం తమ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని గవర్నర్ ను కలసిన దినకరన్... తమ వర్గం పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని... అధికారపక్షం వెంటనే బలాన్ని నిరూపించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
అంతేకాదు, రాజ్ భవన్ నుంచి బయటకు రాగానే మళ్లీ క్యాంపు రాజకీయాలకు దినకరన్ తెరతీశారు. ఈ 19 మంది ఎమ్మెల్యేలకు తోడు మరో ముగ్గురిని కలుపుకుని మొత్తం 22 మంది ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించారు. వీరంతా కలసి పాండిచ్చేరిలోని రిసార్ట్ కు తరలివెళ్లారు.