: అదే మేము భారత్ లోకి ప్రవేశిస్తే ఎంతగా వాపోయేవారు!: చైనా
రెండు నెలలకు పైగా భారత్, చైనా, భూటాన్ సరిహద్దు వద్ద నెలకొన్న డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రతిరోజు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోన్న చైనా తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసింది. డోక్లాం భూభాగం తమదేనని పేర్కొంటున్న చైనా.. ఆ ప్రాంతంలోకి భారత ఆర్మీ ప్రవేశించడం ఏంటని ప్రశ్నించింది. అదే భారత భూభాగంలోకి తమ బలగాలు అలా ప్రవేశిస్తే ఇండియా ఎంతగా గొడవ చేసేదోనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ వ్యాఖ్యానించారు.
డోక్లాం విషయలో భారత్ చేస్తోన్న వాదన హాస్యాస్పదమని పేర్కొన్నారు. తమ దేశం రోడ్డు పనులు కొనసాగిస్తోందన్న సాకుతో భారత ఆర్మీ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని అన్నారు. ఏ దేశ ఆర్మీ అయినా తమ పక్క దేశంలో తనకు ఇష్టం లేని పనులు జరుగుతుంటే ఇలా ప్రవేశించవచ్చా? అని వ్యాఖ్యానించారు. భారత్ కూడా సరిహద్దులో నిర్మాణాలు చేపడితే తమ బలగాలు కూడా అలా ప్రవేశించవచ్చా? అని ప్రశ్నించారు.