: ఇక పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే పాస్ పోర్టు: అమలు చేయనున్న కేంద్రం

పాస్ పోర్టు కావాలని దరఖాస్తు చేస్తే, పోలీసులు ఇంటికి వచ్చి విచారణ జరిపి సర్టిఫై చేయాల్సి వుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. దరఖాస్తుదారుడి పూర్వాపరాలన్నీ ఒక్క క్లిక్ తో తెలిసిపోతాయని, వారికి నేర చరిత్ర ఉన్నదీ, లేనిదీ తెలుసుకుని ఆ వెంటనే పాస్ పోర్టును జారీ చేస్తామని కేంద్ర హోం శాఖ అధికారి రాజీవ్ మెహరిషి వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని, పాస్ పోర్టు సేవలను నేరాలు, నేరగాళ్లు, ట్రాకింగ్ నెట్ వర్క్ కు అనుసంధానం చేయనున్నామని ఆయన వెల్లడించారు.

ఇండియాలో 15,398 పోలీస్ స్టేషన్లు ఉండగా, 13,775 స్టేషన్లలోని క్రైమ్ రికార్డులను ఆన్ లైన్ చేయడం జరిగిపోయిందని వెల్లడించిన ఆయన, ఈ వివరాలు పాస్ పోర్టు కార్యాలయాలకు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలసి 'డిజిటల్ పోలీస్ పోర్టల్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, మార్చిలోగా అన్ని స్టేషన్లలోని నేరాల వివరాలను ఆన్ లైన్లో ఉంచనున్నట్టు తెలిపారు. ఆపై పాస్ పోర్టు పొందడం మరింత సులువవుతుందని రాజీవ్ వెల్లడించారు.

More Telugu News