: బెల్లంకొండ శ్రీనివాస్ పై రకుల్ ప్రీత్ సింగ్ కాంప్లిమెంట్!

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ వరుస హిట్లతో దూసుకుపోతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తో కలసి నటించిన 'జయ జానకి నాయకా' సినిమా కూడా హిట్ జాబితాలో చేరిపోయింది. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ప్రేమలో ఉండే నిజాయతీ ఈ సినిమాలో కనిపిస్తుందని చెప్పింది. బెల్లంకొండ శ్రీనివాస్ పై ఆమె ప్రశంసలు కురిపించింది. సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ శ్రీనివాస్ లో ఎలాంటి భేషజాలు లేవని కితాబిచ్చింది. సినిమా ప్రారంభం నుంచి అతన్ని చాలా క్లోజ్ గా గమనించానని... సినిమా పూర్తయ్యేసరికి ఆయనలో చాలా మార్పు వచ్చిందని చెప్పింది. ఈ సినిమాను చూసిన ప్రతి అమ్మాయి శ్రీనులాంటి వ్యక్తి తనకు భర్త అయితే బాగుంటుందని కోరుకుంటుందని తెలిపింది.

చాలా మంది తనకు నివేదా థామస్, సాయిపల్లవిలు పోటీ అంటున్నారని... అయితే తనకు ఎవరూ పోటీ కాదని, తాను ఎవరికీ పోటీ కాదని రకుల్ తెలిపింది. వారిని చూసి తాను భయపడుతున్నట్టు వస్తున్న వార్తలను చూసి, తాను నవ్వుకున్నానని చెప్పింది. ఎవరికి దక్కాల్సిన పాత్రలు వారికి దక్కుతాయని తెలిపింది. 'ఫిదా'లో సాయిపల్లవి, 'నిన్ను కోరి'లో నివేదా నటనకు తనకు మతి పోయిందని, వెంటనే వారికి ఫోన్ చేసి అభినందనలు తెలిపానని చెప్పింది.

More Telugu News