: పాకిస్థాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్!

పాకిస్థాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాక్ భూభాగంలో ఆశ్రయం కల్పిస్తే, చూస్తూ ఊరుకోబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా ఆపరేషన్ లో భాగస్వామిగా ఉండటం ద్వారా పాక్ భారీగా లాభపడిందని... అయితే, క్రిమినల్స్ కు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం ద్వారా ఆ దేశం దెబ్బతింటుందని ఆయన అన్నారు.

 ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని ఇకపై కూడా కొనసాగిస్తే... ఆ దేశానికి అందించే సైనిక మరియు ఇతర సాయాలు నిలిపేస్తామని చెప్పారు. ఉగ్రవాదులపై పోరాటం నేపథ్యంలో పాక్ కు బిలియన్ల కొద్దీ డాలర్లను తాము ఇస్తున్నప్పటికీ... ఆ దేశం మాత్రం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారు మరింత బలపడేందుకు సాయపడుతోందని ట్రంప్ ఆరోపించారు. ఈ తరహా వ్యవహారశైలికి పాక్ వెంటనే స్వస్తి పలకాలని సూచించారు.

ఇదే సమయంలో భారత్ పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆఫ్ఘన్ లో సుస్థిరమైన పరిస్థితులను నెలకొల్పేందుకు భారత్ చేస్తున్న కృషి అమోఘమని ఆయన కితాబిచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తమకు కీలకమైన ఆర్థిక, సైనిక భాగస్వామి అని అన్నారు.

More Telugu News