: మోదం ఎవరికో? ఖేదం ఎవరికో?... నంద్యాల ఉప ఎన్నికపై ముఖ్యమైన విశేషాలు!

మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తల సందడితో దాదాపు 20 రోజుల నుంచి ఎన్నడూ లేనంత బిజీగా కనిపించిన నంద్యాల మూగబోయింది. నేతల ప్రచారానికి, మైకుల రణగొణ ధ్వనులకూ బ్రేక్ పడింది. నిన్న సాయంత్రం వరకూ వార్డుల వారీగా ఇంటింటికీ తిరిగిన అధికార, విపక్ష ఎమ్మెల్యేలు సాయంత్రం నుంచి ఒక్కొక్కరుగా నంద్యాలను దాటి వెళ్లారు. కిక్కిరిసిన హోటళ్లు ఖాళీ అయిపోయాయి. రెస్టారెంట్లు, హోటళ్లలో భోజనాలకు డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. కార్ల సందడి తగ్గిపోయింది. గెలుపు తమదేనంటే తమదేనని అధికార, విపక్షాలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఎవరు గెలుస్తారన్న విషయమై, పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే...

* రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరుగుతుంది.
* ఓటు వేశాక, ఏడు సెకన్ల పాటు ఏ పార్టీకి ఓటేశామన్న విషయం కనిపిస్తుంది.
* మొత్తం ఓటర్ల సంఖ్య : 2.19 లక్షలు
* ఓటు రసీదులు 2.03 లక్షల మందికి పంచారు.
* మిగతావారిలో 3,626 మంది చనిపోగా, 4,865 మంది బదిలీ అయ్యారు. మరో 4,269 మంది ఆచూకీ లేదు.
* నంద్యాల పట్టణంలో 1,42,628 మంది ఓటర్లు.
* రూరల్ నంద్యాలలో 47,386 మంది ఓటర్లు.
* గోస్పాడు మండలంలో 28,844 మంది ఓటర్లు.
* 2,943 మంది రెండు చోట్ల ఓట్లను కలిగివున్నారు.
* ఎన్నికల భద్రత కోసం 82 ప్రత్యేక స్క్వాడ్ లు రంగంలోకి దిగాయి.
* 255 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్ట్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
* నగదు తరలింపు, మద్యం పంపిణీ తదితర ఘటనలపై 368 కేసులు నమోదయ్యాయి.
* ఇప్పటివరకూ రూ. 1.16 కోట్ల నగదును సీజ్ చేశారు.

More Telugu News