: నెటిజన్ కామెంట్ కు సరైన సమాధానం చెప్పిన మిథాలీరాజ్!

టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీరాజ్ పై కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు ఆమె తగిన రీతిలో సమాధానం చెప్పింది. బెంగళూరులో ఓ క్రికెట్ సెంటర్ ను మిథాలీరాజ్ నిన్న ప్రారంభించింది. ఈ సందర్భంగా తన సహచర క్రికెటర్లు వేదా కృష్ణమూర్తి, మమతా మాబెన్, నూషిన్ అల్ ఖదీర్ తో దిగిన ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో మిథాలీ రాజ్ పోస్ట్ చేసింది.

 ‘ఎంతో ప్రత్యేకమైన ఈ మహిళల సరసన నిలబడి ఉన్న ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు!!’ అని తన ట్వీట్ లో మిథాలీ పేర్కొంది. ఈ ఫొటోలో మిథాలీ స్లీవ్ లెస్ టాప్ ధరించి ఉంది. ఆమె ఎడమ భుజం కింద భాగంలో కొంచెం చెమటపట్టి టాప్ తడిసిపోయి ఉంది. ఈ ట్వీట్ పై స్పందించిన ఓ నెటిజన్, ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ‘ సారీ ఎస్ఎంటీ కెప్టెన్, హాహాహా.. అసహ్యంగా కనపడుతోంది ...’ అని అన్నాడు.

ఇందుకు స్పందించిన మిథాలీరాజ్ ఘాటుగా జవాబిచ్చింది. ‘క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవం కోసం గ్రౌండ్ లో ఉన్న నేను, అందుకు, సిగ్గుపడాల్సిన పని లేదు’ అని పేర్కొంది. అయితే, సదరు నెటిజన్ రాతలపై తోటి నెటిజన్లు మండిపడ్డారు. ‘ఆమె అసహ్యంగా కనపడటం కాదు, ఎంతో అందమైన ఈ ప్రపంచంలో నువ్వు పుట్టడమే అసహ్యం’ అని ఓ నెటిజన్ మండిపడ్డాడు.

More Telugu News