: మావోయిస్టులపై అంతరిక్షం నుంచి నిఘా.. ప్రత్యేక ఉపగ్రహం తయారీకి కేంద్రం నిర్ణయం!

మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. దండకారణ్యం నుంచి వారిని సమూలంగా ఏరివేసేందుకు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉపగ్రహం ద్వారా వారిపై నిఘా పెట్టాలని యోచిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఉపగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.  

దట్టమైన అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్న భద్రతా దళాలకు మరింత వెన్నుదన్నుగా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వేలాదిమంది భద్రతా సిబ్బంది అబూజ్‌మడ్, బస్తర్ వంటి ప్రాంతాల్లో అడుగడుగునా కూంబింగ్ నిర్వహిస్తుండడంతో ఆ ప్రాంతాలు బలగాల చేతుల్లోకి వచ్చాయి. అయితే ఒక్కసారిగా చుట్టుముట్టి విరుచుకుపడుతున్న నక్సల్స్ చేతుల్లో పడి పెద్ద సంఖ్యలో సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు మరణిస్తుండడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది.

దీంతో చిమ్మచీకట్లో సైతం వారి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఉపగ్రహాన్ని రూపొందించాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్రం నిర్ణయించింది. 2012లో ప్రయోగించిన ఆర్ఐశాట్-1 ఉపగ్రహం తగినంతగా ఉపయోగపడకపోవడం, ఈ ఏడాదితో దాని కాలపరిమితి ముగియడంతో కొత్త ఉపగ్రహం తయారు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు సమాచారం.

More Telugu News