: ఏం..? రక్షణ శాఖ అంటే ఆటలుగా ఉందా?: మనోహర్ పారికర్ పై శివసేన ఆగ్రహం

'రక్షణ శాఖ అంటే ఆటలుగా ఉందా?' అంటూ గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే... గోవా అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరి కారణంగా ఆ పార్టీ కంటే తక్కువ సీట్లు సాధించిన బీజేపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తన పదవికి రాజీనామా చేసి, గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన అక్కడి అసెంబ్లీకి ఎన్నిక కావలసి ఉండడంతో, ఈ నెల 23న జరిగే పనాజీ స్థానానికి పోటీ చేస్తున్నారు.

 ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికలో తాను ఓడిపోతే తిరిగి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా వెళ్లిపోతానని పారికర్‌ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ, పనాజీ ఉప ఎన్నికల్లో ప్రజలు తనని ఆదరించరేమోనని మనోహర్‌ పారికర్‌ భయపడుతున్నారన్నారు. ఆయనపై ప్రజలకు నమ్మకం లేక ఆయనను గెలిపించకపోతే ఆయన ఇంట్లో కూర్చోవాలి కానీ, మళ్లీ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా వెళ్లిపోతాననడంలో అర్థం లేదని అన్నారు. రక్షణ శాఖ అంటే ఆటగా ఉందా? అయినా దేశంలో పూర్తికాలం రక్షణ మంత్రంటూ ఎవ్వరూ లేరని ఆయన అన్నారు. 

More Telugu News