: అధికార పార్టీలోకి ఫిరాయిస్తే పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయినట్టు ఫీలవుతున్నారు!:కేంద్ర ఎన్నికల కమిషనర్

అధికార పార్టీలోకి జంప్ చేస్తే పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయని, నేరాలన్నీ సమసిపోతాయనే భావన రాజకీయనాయకుల్లో పెరిగిపోతోందని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు, రాజకీయ సంస్కరణలకు సంబంధించి అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, చట్టసభల సభ్యులను తమవైపు తిప్పుకోవడం, డబ్బులు వెదజల్లి ఆకర్షించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి బెదిరించడం మొదలైనవి తెలివైన రాజకీయ నిర్వహణగా చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతే కాకుండా ప్రస్తుత సమాజంలో రాజకీయనాయకులు అధికార పార్టీలోకి ఫిరాయిస్తే తాను చేసిన నేరాలతో పాటు అన్ని అపరాధాలు తొలగిపోతాయనే భావన కూడా పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాలపై అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, మీడియా, ప్రజా సంఘాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానాన్ని సంస్కరిస్తూ, ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని ప్రవేశపెట్టిందని, దాని వల్ల ఎన్నికల వ్యవస్థలోకి నల్లధనం ప్రవేశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదికలు డబ్బులు తీసుకుని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని. వీటిపై ఈసీ సోషల్ మీడియా పాలసీని తయారు చేస్తోందని ఆయన తెలిపారు. 

More Telugu News