: ఫ్యాన్ గట్టిగా వీస్తోంది.. విగ్ ఎగిరిపోతుందని బాలకృష్ణ పారిపోయాడు: రోజా

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో నిర్వహించిన రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ, ‘బ్రిటిష్ వాళ్ల కన్నా మనల్ని ఘోరంగా మోసం చేసిన చంద్రబాబునాయుడుకి ఓటర్లు కొట్టే దెబ్బతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి. ఫ్యాన్ లోపల ఉంటుంది. సైకిల్ బయట ఉంటుంది. మనకు ఎప్పుడు పని వచ్చినా శిల్పా మోహన్ రెడ్డి గారు పక్కనే ఉంటారు. బ్రహ్మానందరెడ్డి ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు!. కాబట్టి, ఎంత తిరిగినా ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేస్తేనే చల్లగా ఉంటుంది.

2019లో మనం అధికారంలోకి రాబోతున్నాం.. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోబోతున్నాం. దానికి నాందిగా ఈ రోజు జరిగే ఈ ఉపఎన్నికల్లో నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి ‘అబ్బా’ అనిపించేలాగా.. ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలి.  మహిష్మతి సామ్రాజ్యం ఎప్పుడూ బాహుబలిదే. అలాగే, నంద్యాల గడ్డ ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబానికే అని నిరూపించాలి. ఫ్యాన్ గట్టిగా వీస్తోంది.. విగ్ ఎగిరిపోతుందని బాలకృష్ణ పారిపోయాడు’ అని రోజా విమర్శించారు. కాగా, నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల క్రితం నిర్వహించిన రోడ్ షో లో బాలకృష్ణ పాల్గొన్న సంగతి విదితమే! 

More Telugu News